ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగ సభలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. గోపిదేశి రమాదేవి, షేక్ మస్తాన్ బీ, సయ్యద్ ఆసీయా అనే ముగ్గురు మహిళలు తొక్కిసలాటలో మరణించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.