కరోనా పీక్ టైం లో కేంద్రం తీసుకువచ్చిన ఎయిర్ సువిధ విధానంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇకపై విదేశాల నుంచి మన దేశానికి వచ్చే విమాన ప్రయాణికులు కరోనా సంబంధిత వివరాలతో ‘ఎయిర్ సువిధ’ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి రానున్నట్లు తెలిపింది. కరోనా లేదని తెలిపే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదికను గానీ, టీకా తీసుకున్నట్లు ధ్రువీకరించే పత్రాన్ని గానీ సమర్పించాల్సిన అవసరం కూడా లేదని ప్రకటించింది.