అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా పెట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు హైకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు షాక్ ఇస్తూ … పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది.
ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఎపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై సోమవారం హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది.
ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది.
ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు టాక్.