హైదరాబాద్: ఏడాదిగా పట్టి పీడిస్తున్న మహమ్మారి వైరస్కు విరుగుడుగా తీసుకొచ్చిన వ్యాక్సిన్లు ఈనెల 16నుంచి తొలిదశ పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
సీరమ్ ఇన్స్టిట్యూట్ 1.1 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా.. భారత్ బయోటెక్ 55 లక్షల కోవాగ్జిన్ను ఉత్పత్తి చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మంగళవారం పుణె నుంచి రాష్ట్రాలకు చేరగా.. తాజాగా భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విమానంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ను పంపించారు. ఢిల్లీకి ఉదయం 9 గంటలకు చేరింది.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వినియోగానికి అత్యవసర అనుమతి జారీ చేసిన నేపథ్యంలో 54.72 లక్షల డోసుల వ్యాక్సిన్ రాష్ట్రాలకు చేరగా, ఇది మొత్తం 1.65 కోట్ల డోసులకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.