చెన్నై : శశికళ జైలు నుంచి విడుదల కావడంతో తమిళనాట రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈనెల 24న దివంగత జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి.
సేవా కార్యక్రమాలో పరుగులు తీయనున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రజాకర్షణ దిశగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్లో జరిగే సభలో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్లో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పాల్గొంటారు.
ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న డీఎంకే కు అడ్డుకట్ట వేసేందుకు , తమిళనాట తిరిగి తన సత్తా చాటేందుకు ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే రీతిలో శశికళ పావులు కదుపుతున్నారు.
జైలు నుంచి టీనగర్ ఇంటికి చేరిన శశికళ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. వారం రోజులు చిన్నమ్మ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈనెల 24న జయలలిత జయంతి రోజున ముఖ్యులతో భేటీ, ఆలయ దర్శనానికి చర్యలు తీసుకున్నట్టు వినిపిస్తోంది.
వైద్యులతో సంప్రదించి, ఆతర్వాత కేడర్లోకి చొచ్చుకెళ్లే విధంగా శశికళ పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లు టాక్. జయ జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు.
వీరితోపాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంవర్గీయలతో భేటీ కావడం ద్వారా ఇక రాజకీయంగా దూకుడు పెంచు తారని, అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని అంటున్నారు.