సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వ్యవస్థలతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ భారీ క్షిపణి గురువారం సాయంత్రం 5.30 గంటలకు గగనతలంలోకి దూసుకెళ్లింది. అణ్వస్త్రాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఈ బాలిస్టిక్ మిస్సైల్ సొంతం. ఇది 5 వేల కిలోమీటర్లకు ఆవల ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. తాజా ప్రయోగం ద్వారా దీని రేంజి పెంపుదల అవకాశాలను, రాత్రివేళల్లో ప్రయాణ సామర్థ్యాన్ని పరీక్షించారు. అనుకున్న మేర ఇది అంచనాలను అందుకుందని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి.