ప్రముఖ నటుడు కమలహాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం పట్ల అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్ నిన్న సాయంత్రం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. నిన్న హైదరాబాదులో కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిసిన ఆయన, సాయంత్రానికి ఆసుపత్రి పాలవడంతో అభిమానుల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో, శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యులు కమల్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం కమలహాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు. కమల్ ఆరోగ్య పరిస్థితి మరింత కుదుటపడ్డాక, మరో రెండ్రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు.