టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. తెలుగులో పలు హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సహాయంతో మొదటిసారిగా కూతురు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న పెద్దాడ.. ఆ తర్వాత ఇడియట్, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, అది నువ్వే, నాకూ ఓ లవ్వర్ ఉంది తదితర తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయిలో నీవే నీవే, ఇడియట్ లో చెలియా చెలియా వంటి పాటలు పెద్దాడమూర్తికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.