తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఐఎఎస్ రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తో పాటు శాంతి కుమారి, రజత్ కుమార్, అరవింద్ కుమార్ పేర్లను కూడా సిఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ ఆర్థిక శాఖను రామకృష్ణా రావే చూస్తున్నారు. ఆయన కేసీఆర్కు సన్నిహితుడే కాకుండా, సీనియర్ల జాబితాలో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా. దీంతో సహజంగానే ఆయనకే సీఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్రం ఏపీకి బదిలీ చేసినా వెళ్ళకుండా క్యాట్ కి వెళ్ళి తెలంగాణలోనే ఉండేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే క్యాట్ నిర్ణయాన్ని హైకోర్ట్ కొట్టేయడంతో సోమేష్ ఇప్పుడు ఏపీకి వెళ్ళక తప్పట్లేదు.