న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) చరిత్ర సృష్టించింది. సోమవారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్ ధర 3.5 శాతం పెరిగి గరిష్ట స్థాయి 3,230 రూపాయలను తాకింది.
దీంతో తొలిసారిగా టీసీఎస్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఇంతకముందు ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) సాధించింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉండడంతో మార్కెట్లో ఆ కంపెనీ షేరు దూసుకుపోయింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం సంవత్సరానికి 7.17 శాతం పెరిగి రూ.8,727 కోట్లకు చేరుకుంది.
ట్రేడింగ్ సమయం లో టీసీఎస్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో తొలిసారిగా దేశంలో 12 లక్షల కోట్ల క్యాపిటలైజెషన్ దాటిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఒక్కో షేరు ధర రూ.1,365.95, హెచ్సిఎల్ టెక్నాలజీస్ రూ.1,029, విప్రో రూ.444.95, మైండ్ట్రీ రూ.1,764.50, టెక్ మహీంద్రా రూ.1,068.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ లో పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ లో వృద్ధి కనిపించినట్లు నిపుణులు పేర్కొన్నారు.